ఆలయ భూములు ప్రభుత్వ భూములు కావని, వాటిపై అసలు హక్కు దేవదేవుడిదేనని ఎమ్మెల్యే డా. పార్థసారథి స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ భూములకు యజమాని కాదని, కేవలం కాపలాదారు (Custodian) మాత్రమేనని ఆయన తెలిపారు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు ఈ భూములను తమ సొంత ఆస్తిలా భావించి ఇతర అవసరాలకు కేటాయించడం పూర్తిగా చట్ట విరుద్ధమని విమర్శించారు.
ప్రజల అవసరాల కోసం భూములు అవసరమైతే ప్రభుత్వ భూములను ఉపయోగించుకోవచ్చుగానీ, ఆలయ భూములను ఇవ్వడం సరైన పద్ధతి కాదని ఆయన సూచించారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం భూములను హోటల్కు ఇవ్వడం, సింహాచలం ఆలయ భూములను డేటా సెంటర్కు కేటాయించడం, అలాగే కాకినాడ భావనారాయణ స్వామి ఆలయ భూములను క్రికెట్ స్టేడియానికి ఇవ్వడం వంటి నిర్ణయాలు హిందూ సమాజంలో ఆందోళనకు కారణమయ్యాయని అన్నారు.
అర్బన్ ప్రాంతాల్లో దేవాలయ భూములను 33 సంవత్సరాల దీర్ఘకాలిక లీజుకు ఇవ్వడం వంటి అంశాలపై కూడా సమాజంలో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. దేవాలయ వ్యవస్థ పవిత్రతను కాపాడుతూ ఆలయ భూములను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, దీనిపై స్పష్టమైన భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే డా. పార్థసారథి తెలిపారు.

